హాలీవుడ్ చరిత్రలో కనీవిని ఎరుగని గ్రాఫిక్స్ మాయాజాలంలో అందరినీ అలరించిన మాస్టర్ పీస్ చిత్రం అవతార్. 2009లో విడుదలైన అవతార్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సాధించిన కలెక్షన్ల రికార్డ్ బ్రేక్ చేయడానికి అవెంజర్స్ లాంటి భారీ సినిమాలు సైతం ఎంతో కష్టపడాల్సి వచ్చింది. టైటానిక్, టెర్మినేటర్ లాంటి అద్భుత చిత్రాల దర్శకుడు జేమ్స్ కెమెరూన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే ఈ చిత్రానికి 2022లో ‘అవతార్ – ది వే ఆఫ్ వాటర్’ పేరుతో సీక్వెల్ వచ్చింది. తాజాగా అవతార్ మూడో భాగం టైటిల్ ను డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ తో పాటు, ప్రధాన నటీనటులు సామ్ వర్తింగ్ టన్, జోయి సల్డానా రిలీజ్ చేశారు.
అవతార్ 3 చిత్రానికి అవతార్ ఫైర్ అండ్ ఆష్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్ర టైటిల్ పోస్టర్ ను శుక్రవారం విడుదల చేశారు. పోస్టర్ లో భారీ అగ్ని జ్వాలల మధ్య చిత్ర ప్రధాన నెతిరి.. ఒక బాన్ షీ పక్షిపై ఎగురుతూ కనిపిస్తోంది. ఈ పోస్టర్ ను చిత్ర బృందం శుక్రవారం డి23 ఎక్స్పోలో రిలీజ్ చేశారు.
ప్రేక్షుకులకు మరిచిపోలేని వింత అనుభూతి ఇచ్చిన అవతార్ కథ.. భూమికి లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్పిత గ్రహం పండోరా గ్రహంపై సాగుతోంది. అభివృద్ధి, టెక్నాలజీ పేరుతో మానవులు తమ స్వార్థం కోసం భూగ్రహాన్ని నాశనం చేసిన తరువాత ప్రకృతి అందాలతో మెండుగా ఉన్న పండోరా గ్రహాన్ని ఆక్రమించుకోవాలని.. అక్కడి ప్రకృతి సంపద, ఖనిజాలను దోచుకోవాలని ప్రయత్నిస్తున్న క్రమంలో వారిని హీరో జేక్ సుల్లీ, అతని భార్య నెతిరి ఎలా అడ్డుకుంటారనేదే కథాంశం. అద్యంతం యాక్షన్ సన్నివేశాలతో సాగే ఓ వింత ప్రపంచం ఈ సినిమాలో కనిపిస్తుంది.
2022లో విడుదలైన అవతార్ రెండో భాగం ది వే ఆఫ్ వాటర్ లో దర్శకుడు పండోరా గ్రహంలోని సముద్ర జీవుల విన్యాసాలను చూపించి ఆకట్టుకున్నాడు. అయితే సినిమా మూడో భాగం కూడా రెండో భాగం షూటింగ్ సమయంలోనే పూరి అయిందని.. పోస్ట్ ప్రొడక్షన్ విఎఫ్ఎక్స్ పనులకు చాలా సమయం పట్టడంతో ఈ సినిమాను 2025 డిసెంబర్ లో రిలీజ్ చేస్తున్నట్లు దర్శకుడు కెమెరూన్ ప్రకటించాడు. అవతార్ మూడో భాగంలో పేరుకు తగ్గట్టుగా పండోరా నాశనం చేసే క్రమంలో జరిగే మనుషులకు పండోరాలో నివసించే నావీలకు యుద్దమే ఇతివృత్తం. అయితే ఈసారి అగ్ని కాన్సెప్ట్ గా అగ్ని పర్వతాల విజువల్స్ ఉండే అవకాశం ఉంది.