UPDATES  

NEWS

 చెరువుల ఎఫ్‌టీఎల్ మార్పు ఉండదు: ఎమ్మెల్యే కృష్ణారావు ఆరోపణలను ఖండించిన హైడ్రా కమిషనర్

కూక‌ట్‌ప‌ల్లి ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావు చేసిన ఆరోప‌ణ‌ల‌పై హైడ్రా (HYDRA) క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఘాటుగా స్పందించారు. సున్నం చెరువు ఎఫ్‌టీఎల్ (FTL) ప‌రిధిలో కొంద‌రికి ల‌బ్ధి చేకూర్చేలా హద్దులను మారుస్తున్నారన్న ఎమ్మెల్యే విమర్శలను ఆయన తోసిపుచ్చారు. చెరువుల ఎఫ్‌టీఎల్ ప‌రిధిని ఒక్క‌సారి నిర్ణయిస్తే అవి మార‌వ‌ని, సున్నం చెరువు హద్దులను 2014లోనే ఖరారు చేశారని ఆయన స్పష్టం చేశారు. కేవలం హైకోర్టు ఉత్త‌ర్వుల మేర‌కు, చట్టబద్ధంగానే తాము పనులు చేస్తున్నామని వివరించారు.

హైడ్రా ప‌నితీరుపై వస్తున్న ఫిర్యాదుల్లో దాదాపు 40 శాతం కూక‌ట్‌ప‌ల్లి జోన్ నుంచే వస్తున్నాయని కమిషనర్ వెల్లడించారు. అక్కడ భూముల విలువ ఎక్కువగా ఉండటంతో ఆక్రమణలు అధికంగా ఉన్నాయని, ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాలను కాపాడటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. గతంలో హైడ్రా చర్యలను అభినందించిన ఎమ్మెల్యే, ఇప్పుడు హఠాత్తుగా వ్యక్తిగత విమర్శలకు దిగడం వెనుక ఉన్న కారణాలు అర్థం కావడం లేదని రంగనాథ్ వ్యాఖ్యానించారు.

హైడ్రా ఇప్పటివరకు 1240 చోట్ల ఆక్రమణలు తొలగించి, 1310 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుందని కమిషనర్ గణాంకాలతో వివరించారు. స్వాధీనం చేసుకున్న భూములను వెంటనే పాఠశాలలు, పార్కులు మరియు ప్రభుత్వ కార్యాలయాల కోసం కేటాయిస్తున్నట్లు గుర్తు చేశారు. గాజులరామారంలో 300 ఎకరాలు, కొండాపూర్‌లో 7 ఎకరాలను రక్షించి ప్రజావసరాలకు మళ్లించామని, రాజకీయాలకు అతీతంగా పర్యావరణహిత నగరాన్ని నిర్మించడమే తమ అంతిమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |