తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత టి. హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వరంగల్లో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి, వారి ఆరోగ్యం మరియు భద్రతకు పెద్దపీట వేశామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పట్ల విసుగు ప్రదర్శిస్తోందని ఆరోపించారు.
గత రెండు బడ్జెట్లలో జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడంపై హరీశ్ రావు విస్మయం వ్యక్తం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూ. 100 కోట్లతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేశామని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో గత రెండున్నరేళ్లుగా ఒక్క కొత్త అక్రిడిటేషన్ కార్డు కూడా జారీ చేయలేదని, నిబంధనల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే అర్హులైన జర్నలిస్టులందరికీ కార్డులు అందజేయాలని డిమాండ్ చేశారు.
జర్నలిస్టుల ఆరోగ్య భద్రత విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆయన కోరారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు హెల్త్ స్కీమ్ అమలు చేయాలని, అలాగే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తూ, బీఆర్ఎస్ హయాంలో అందించిన ఉచిత వైద్య సేవలను పునరుద్ధరించాలని హరీశ్ రావు ప్రభుత్వాన్ని కోరారు.








