కూటమి ప్రభుత్వం “దోచుకో.. పంచుకో.. తినుకో..” అనే సిద్ధాంతంతో పాలిస్తోందని వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశంలో ఆయన చంద్రబాబు పాలనా తీరును ఎండగట్టారు.
వచ్చే ఏడాది తాను పాదయాత్ర ప్రారంభిస్తానని, అప్పటి నుంచి చంద్రబాబుకు ప్రతిరోజూ సినిమా చూపిస్తామని జగన్ హెచ్చరించారు. గత ప్రభుత్వంలో తాము చేసిన అప్పుల్లో మెజారిటీ వాటా (రూ. 2.73 లక్షల కోట్లు) నేరుగా డీబీటీ ద్వారా ప్రజల ఖాతాల్లోకి చేరిందని తెలిపారు. చంద్రబాబు ఈ రెండేళ్లలోనే రూ. 3.52 లక్షల కోట్ల అప్పు చేశారని… ఈ నిధులన్నీ ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయని ఆయన ప్రశ్నించారు.
ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు చెత్తబుట్టలోకి వెళ్లాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వం నాశనం చేసిందని విమర్శించారు. గత ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రగతిని తిరోగమనంలోకి నెట్టారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని కేడర్కు దిశా నిర్దేశం చేశారు.







