ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మరోసారి ఉద్రికత్త పరిస్థితి చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు జరిపిన రాకెట్ దాడి మణిపూర్ను అట్టుడికించింది. ఈ దారుణ ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా వారి తల్లి తీవ్రంగా గాయపడింది. బిష్ణాపూర్ జిల్లా మోయిరంగ్ ప్రాంతంలోని ట్రోంగ్లాబి అవాంగ్ లైకై గ్రామంలో సోమవారం అర్ధరాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో గాఢనిద్రలో ఉన్న సమయంలోనే రాకెట్ దాడి జరగడంతో ఐదేళ్ల బాలుడు అలాగే ఆరు నెలల పసిపాప అక్కడికక్కడే మరణించారు.
ఈ ఘటన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఉద్రిక్తతలు తలెత్తాయి. మైతీ-కుకీ తెగల మధ్య నెలకొన్న పాత కక్షలు మళ్లీ ముదిరాయి. కుకీ తెగ వారే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆగ్రహంతో ఊగిపోయిన ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. సమీపంలోని ఆయిల్ ట్యాంకులు సహా ట్రక్కులను ఆందోళనకారులు తగలబెట్టారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు అలాగే భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి.
శాంతిభద్రతలను కాపాడే క్రమంలో భద్రతా దళాలు జరిపిన కాల్పులలో దాదాపు 19 మందికి గాయాలయ్యాయి. హింసాత్మక ఘటనలు మరింత విస్తరించకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. బిష్ణాపూర్తో పాటు మరో నాలుగు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. తప్పుడు సమాచారం ప్రచారంలోకి రాకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో కర్ఫ్యూ విధిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఘటనపై మణిపూర్ సీఎం వై ఖేంచంద్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమాయక చిన్నారుల ప్రాణాలు తీయడాన్ని అమానుషమైన తీవ్రవాద చర్యగా ఆయన పేర్కొన్నారు. నిందితులను వదిలే ప్రసక్తి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. గత కొంతకాలంగా మణిపూర్లో తెగల మధ్య సాగుతున్న ఘర్షణలు ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్నాయని భావిస్తున్న తరుణంలో ఈ రాకెట్ దాడి జరగడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. సరిహద్దుల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.








