హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్రకుమార్ రచనలు ప్రజలను చైతన్యవంతం చెస్తాయని పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ అన్నారు. భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ కవి కళారత్న డా. బిక్కి కృష్ణ అధ్యక్షతన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జస్టిస్ బి. చంద్రకుమార్ రాసిన “అమ్మకావాలి-నాన్న కావాలి” నవల ఆవిష్కరణ సభ జరిగింది.ఈ సభలో ఆచార్య కొలకలూరి ఇనాక్ ముఖ్య అతిథిగా పాల్గొని నవలను ఆవిష్కరించారు. భారతీయ కుటుంబవ్యవస్థ గొప్పదనాన్ని, విడాకులవల్ల భార్యాభర్తలతో పాటు వారిపిల్లలు పడే మానసిక వేదనను రచయిత వేదనతో నవలగా శిల్పీకరించారని వక్తలు కొనియాడారు. తెలుగు నవలా సాహిత్యంలో ఇదో గొప్ప నవలని కితాబిచ్చారు. ఈ సభలో అతిథులుగా ప్రముఖ రచయితలు కె. వి. కృష్ణకుమారి, డా. పి. విజయలక్ష్మి పండిట్, డా. జెల్ది విద్యాధర్, డా. కోగంటి ఉషారాణి, డా. రాధాకుసుమ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. రాధా కుసుమ నిర్వహణలో జరిగిన కవిసమ్మేళనంలో నలభైమంది కవులు పాల్గొని తమ కవితలు వినిపించారు.









