ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పూర్తి చట్టబద్ధత ఏర్పడింది. అమరావతిని ఏపీ ఏకైక రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం నేడు అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత కేంద్ర న్యాయశాఖ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేయడంతో అమరావతికి సంపూర్ణ చట్టబద్ధత లభించినట్లయింది.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అమరావతి రాజధాని సవరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి పార్లమెంటుకు పంపిన విషయం తెలిసిందే. అక్కడ లోక్సభ, రాజ్యసభ రెండూ ఈ బిల్లుకు ఆమోదం తెలిపాయి. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేయడంతో, దీనికి అధికారిక ముద్ర పడింది. ఈ ప్రక్రియలన్నీ పూర్తవడంతో కేంద్ర న్యాయశాఖ తుది నోటిఫికేషన్ జారీ చేసింది.
2014 నాటి సీఆర్డీయే చట్టంలో పొందుపరిచిన అమరావతిని రాజధానిగా నోటిఫై చేస్తున్నట్లు ఇందులో స్పష్టం చేసింది. 2024 జూన్ 2వ తేదీ నుంచే ఈ నిర్ణయం వర్తిస్తుందని కేంద్రం తన గెజిట్లో పేర్కొంది.









