తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఏపీ అధ్యక్షుడిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడుకు మంత్రిగా అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే బీసీ-యాదవ వర్గానికి చెందిన పల్లా శ్రీనివాసరావుకు ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పై భారీ మెజార్టీతో పల్లా శ్రీనివాసరావు విజయం సాధించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా 95,235 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు.
ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లాను నియమిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా రాజేశ్వరరావును నియమిస్తున్నాను. విశాఖపట్నం పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేసిన పల్లా శ్రీనివాసరావు నూతన బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.
రాష్ట్ర అధ్యక్షులుగా ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీని నడిపించడంలో అద్భుత పనితీరు కనబర్చిన సీనియర్ నేత, రాష్ట్రమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకి అభినందనలు తెలిపారు. ప్రతిపక్షంలో అనేక సమస్యలు, సవాళ్లను ఎదుర్కొని పార్టీ బలోపేతానికి అచ్చెన్నాయుడు ఎనలేని కృషి చేశారని చంద్రబాబు కొనియాడారు.
కాగా, ఏపీ పునర్విభజన తర్వాత టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇప్పటి వరకు రెండుసార్లు ఉత్తరాంధ్ర నేతలకే దక్కగా.. ఇది మూడోసారి కావడం విశేషం. తొలుత కళా వెంకట్రావుకు అప్పగించగా.. ఆ తర్వాత గత ఐదేళ్ల నుంచి అచ్చెన్నాయుడు ఆ పదవిలో కొనసాగుతున్నారు. అయితే, అచ్చెన్నాయుడికి మంత్రివర్గంలో చోటు లభించడంతో ఆయన స్థానంలో మరో బీసీ నేత పల్లా శ్రీనివాసరావును నియమించారు. గాజువాక నుంచి పోటీ చేసిన పల్లా శ్రీనివాసరవు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు. వైయస్సార్సీపీ నేతలు.. పల్లాను పార్టీ మారాలని ఒత్తిడి చేసినా.. ఆయన టీడీపీలోనే కొనసాగారు.