ప్రముఖ సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఆయన సొంత ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. శుక్రవారం పట్టణ సమీపంలోని వనం కాలనీలో తన సతీమణి వసుంధరతో కలిసి శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంతో హిందూపురంలో బాలకృష్ణ శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోబోతున్నారనే విషయం స్పష్టమైంది.
సుమారు 81 సెంట్ల విస్తీర్ణంలో ఈ ఇంటిని నిర్మించనున్నారు. గత కొంతకాలంగా బాలకృష్ణ హిందూపురం వచ్చినప్పుడు అతిథి గృహాలు లేదా పార్టీ కార్యకర్తల ఇళ్లలో ఉంటున్నారు. అయితే, నియోజకవర్గంలోనే సొంత ఇల్లు ఉంటే ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండవచ్చని ఆయన భావిస్తున్నారు. ఈ సందర్భంగా, ఇకపై హిందూపురమే తన ప్రధాన ‘కేరాఫ్ అడ్రస్’ అవుతుందని ఆయన తన సన్నిహితులతో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
బాలకృష్ణ తీసుకున్న ఈ నిర్ణయంపై హిందూపురం నియోజకవర్గ టీడీపీ శ్రేణులు మరియు స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే నియోజకవర్గంలోనే నివాసం ఉండటం వల్ల అభివృద్ధి పనుల పర్యవేక్షణ సులభతరం కావడమే కాకుండా, సమస్యలను నేరుగా చెప్పుకునే అవకాశం ఉంటుందని ప్రజలు ఆశిస్తున్నారు. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, తన నియోజకవర్గ బాధ్యతలకు ప్రాధాన్యతనిస్తూ బాలకృష్ణ ఈ ముందడుగు వేశారు.








