ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో శుక్రవారం అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ అంశంపై చర్చకు పట్టుబట్టిన వైసీపీ ఎమ్మెల్సీలు, సభలో శ్రీవారి చిత్రపటాలను ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. అయితే, సభ్యులు చెప్పులు, బూట్లు ధరించే స్వామివారి చిత్రాలను పట్టుకున్నారని, ఇది హిందూ ధర్మానికి వ్యతిరేకమని అధికార పక్షం మండిపడింది. ఈ గందరగోళం మధ్య మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు సభను వాయిదా వేయాల్సి వచ్చింది.
ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందించారు. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళినప్పుడు చెప్పులతోనే ఆలయ ప్రాంగణంలో తిరిగారని, ఇప్పుడు ఆయన బాటలోనే వైసీపీ ఎమ్మెల్సీలు కూడా మండలిలో అపవిత్రంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. చేసిన తప్పులకు హిందువులకు క్షమాపణలు చెప్పాల్సింది పోయి, అడ్డంగా వాదిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్ కూడా వైసీపీ తీరును తీవ్రంగా ఖండించారు.
అయితే, అధికార పక్షం చేస్తున్న ఆరోపణలను వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తోసిపుచ్చారు. తమ సభ్యులు చెప్పులు వేసుకుని చిత్రపటాలను పట్టుకున్నట్లు ఒక్క ఆధారమైనా చూపాలని ఆయన సవాల్ విసిరారు. దీనికి ప్రతిగా, ఎమ్మెల్సీలు చెప్పులతో ఉన్నారనడానికి సంబంధించిన కొన్ని ఫోటోలు మరియు వీడియోలను సోషల్ మీడియాలో అధికార పక్ష సభ్యులు విడుదల చేశారు. ఈ వివాదం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది.








